Thought Economics- War and peace- Part 5

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-5

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

 

ప్రశ్న 12: ఘర్షణ కోరే వారికి  ఆయుధాలు మరింత బలాన్ని చేకూర్చాయా?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్:  మరింత పెద్దవి, మరింత మెరుగైన ఆయుధాలు రూపొందించుట మనిషి చరిత్రలో నిరంతర ప్రక్రియ. మొదట మనకు తినటానికి కావలసిన వాటిని చంపుటకు ఆయుధాలను తయారు చేసుకున్నాము. తర్వాత ఆ తిండి కోసం ముందుపడే మనుషులను చంపటానికి ఆయుధాలను రూపొందించుకున్నాము. తర్వాత ప్రత్యక్ష హత్యలనుండి ముందుకెళ్లి దూరంగా ఉన్న మనుష్యులను చంపే ఆయుధాలను రూపొందించుకున్నాము. క్రమక్రమంగా మానవాళిని అంతమొందించే ఆయుధాలను తయారు చేసుకున్నాము. మనిషి కాకుండా యంత్రాలు ఇప్పుడు మనుషులను చంపుతున్నాయి.

ప్రశ్న 13: పౌర సమాజంలో ఏకత్వం/ సంఘీభావం విలువ ఏంటి?

లేక్ వాలేశా: చిన్న ఉదాహరణ చెబుతాను. మనకు ఏదైనా పని కష్టం అనిపించినప్పుడు మనం ఎవరిదైనా సహాయం అడుగుతాము. వాళ్ళు సహాయం చేయటానికి ముందుకొస్తే వారు మనతో సంఘీభావంతో ఉన్నారని అర్థం. అప్పుడు మనం  బలపడ్డట్టు, ఎందుకంటే మనం ఆ పనిని చేయగలుగుతున్నాము. సమాజాలకు గానీ, ఉద్యమాలకు గానీ, రాజకీయ గుంపులకు గానీ ఒకే గమ్యం/ఉద్దేశము ఉన్నప్పుడు వాటికి ఏకత్వం ఉంటుంది, వారు గెలుస్తారు. గతంలో కమ్యూనిజం కొంచెం బరువైనది. అయినా సరే పోలండ్ లో మేము కలసి సాధించాము. ప్రస్తుత సమాజంలో పర్యావరణం ఎంత దెబ్బ తింటుందంటే  మనం నివసించడానికి కూడా వీల్లేక పోతుంది. కాబట్టి పర్యావరణం విషయంలో మనం సంఘీభావంగా ఉండాలి. 

ప్రశ్న 14: శాంతిని నెలకొల్పటాన్ని, సంధి ప్రక్రియను ఎలా ప్రారంభించాలి? 

అధ్యక్షులు మార్టి అతిసారి: అంతర్గతమైనా, బయటిదైనా ఘర్షణ ముద్ర ఎప్పటికీ ఉంటుంది. చాలా సందర్భాలలో సంధి మార్గం అంతా తేలికగా తెరచుకోదు. మా దేశంలో మొదట్లో గెలిచిన వారిదే రాజ్యం. తర్వాత కలుపుకుపోయే విధానాలు వచ్చాయి. దాంతో మాకు మంచి జరిగింది. అయితే ఇందుకు విరుద్ధంగా బోస్నియా, హెర్జెగొవీనా లలో మూడు భిన్న చరిత్రలు ఉన్నాయి: అవి క్రోట్స్, సెర్బులు, బోస్నియాకులు. ఎవరినయినా క్షమించాల్సి వస్తే, జరిగిన అకృత్యాలను వదిలేయలేము. ఇటువంటి సందర్భములలో సమాజంలో ప్రవర్తనా మార్పును మనం సాధించాలి. గతంలో జరిగింది, భవిష్యతులో జరగకూడనిది ప్రజలందరికీ తెలియాలి. జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దటం మన వలన కాదు. ఉత్తర ఐర్లాండులో ఎక్కువభాగం శాంతిగానే ఉంది, కానీ అక్కడ సంధి ప్రయత్నం పూర్తి కాలేదు. ఘర్షణ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, శాంతి ప్రయత్నం ఎక్కువ కాలం పడుతుందని. ముందుగా శాంతి ప్రక్రియను వీలైనంత ఎక్కువగా సరళీకరించాలి. జరిగిన అరాచకాలన్నింటినీ పరిష్కరించటం సాధ్యం కాకపోవచ్చును. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అందరినీ సమాధాన పరచ లేకపోవచ్చు, శాంతిని నెలకొల్పడం జటిలం కావచ్చు. అన్నీ విషయాలపై ముందరే ఒప్పందం జరగాలని కొంతమంది కోరవచ్చు. తరచుగా ముందర శాంతి నెలకొంటే తర్వాత సరైన సంభాషణకు వీలవుతుంది. అన్ని సమస్యలను పరిష్కరించటం వీలు కాదు.

నాకు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు, అన్నీ సమస్యలను పరిష్కరించవచ్చని నేను అన్నాను. సైప్రస్, కాశ్మీర్ లో ఎందుకు పరిస్థితులు అలా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. నేను కొసోవో చర్చలలో పాల్గొన్నప్పుడు, పరిష్కరించడానికి అనేక సమస్యలు ఉండగా  ఎందుకు అంతా తొందరపెడుతున్నారని ఒకరు నన్ను అడిగారు. ఈ ప్రపంచంలో అపరిష్కృత సమస్యలు ఉండకూడదని, అది మానవాళికే పెద్ద అవమానమని నేను అన్నాను.

బెర్టీ ఆహార్న్: శాంతిని నెలకొల్పటం ఒక సవాల్ వంటిది. అది సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. తరచుగా యుద్ధం, హింసలు  అనివార్యం. సాయుధ మిలిటెంట్ల బృందాలు  సంభాషణకు ఒప్పుకోవు. శాంతి నెలకొల్పడానికి వ్యూహం  పన్నడం కూడా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి ప్రజలు విసిగిపోయి శాంతి కోసం ఎదురుచూసే సమయం కోసం మనం ఆగాల్సి వస్తుంది. ఘర్షణలో ఉన్న అన్నీ పక్షాలు ప్రస్తుత పరిస్థితి కొనసాగకూడదు, ఏదో ఒక అంగీకారం చేసుకోవడం అందరికీ మంచిది అనే పరిస్థితి రావాలి. ప్రస్తుత పరిస్థితి కొన సాగకూడదని ప్రజలు భావించకపోతే మనం ఏమీ చేయలేము.        

ప్రశ్న 15: శాంతిని నెలకొల్పేందుకు పొందికైన ప్రణాళిక ఉండాలంటారా?

బెర్టీ ఆహార్న్: పొందికైన ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. సంఘర్షణ ఏమిటి, వివిధ  స్థానాలు, ముఖ్య వ్యక్తులు మొదలగు విషయాల గురించి తెలిసిన మధ్యవర్తులను ఏర్పాటు చేసుకోవాలి. వీరు సంభాషణ జరిగేందుకు అవకాశాలను వెతుకుతారు. శాంతిని నెలకొల్పే మొదట్లో అంతా హడావుడి లేకుండా, దౌత్య వ్యవహారాలతో, రహస్యంగా, ప్రసార మాధ్యమాలకు దూరంగా ఉంటుంది. అంతా బహిరంగంగా జరిగితే ప్రగతి ఉండదు.   

ప్రశ్న 15:  పాతుకుపోయిన బృందాలతో శాంతికి ఎలా ఒప్పందం కుదురుతుంది?

అధ్యక్షులు మార్టి అతిసారి: వైరి పక్షాలకు శాంతి అక్కర్లేదంటే మధ్యవర్తి ఏమీ చేయలేరు. Aceh చర్చలలో మేము మూడు సంవత్సరాల పాటు గొడవలు పడకూడదని ఒప్పందం చేయించాము. సంతకాలు చేశారు, కానీ 6 నెలలలో దాన్ని అతిక్రమించారు. అంతలో సునామీ వచ్చింది. 170000 మండి చనిపోయారు. ప్రతి ఒక్కరికీ ఏదో నష్టం జరిగింది. అంతర్జాతీయ సమాజం స్పందించి విరాళాలకు ముందుకొచ్చారు. అయితే శాంతికి ఒప్పుకోకపోతే వారికి ఈ విరాళాలు దొరకవని  అర్థమయ్యేలా చెప్పాము. వారు సంతుష్టులు అయ్యేంతవరకు ప్రసార మాధ్యమాల వద్దకు వెళ్లొద్దని షరతులు పెట్టాము.  దానికి వారు అంగీకరించారు. అంటే వాళ్ళు చర్చలపై గంభీరంగా ఆలోచిస్తున్నారని మాకు అర్థమయ్యింది.

మధ్యవర్తులు నిష్పాక్షికంగా ఉండాలని చెప్పటం తప్పు. నిష్పాక్షికంగా ఉంటే ఏదీ సాధించలేము. వైరి పక్షాల వద్ద తమ పరిష్కారాలు లేకపోతే మనం పరిష్కారాలతో చర్చలకు వెళ్లాల్సి వస్తుంది. నిజాయతీ ఉన్న బ్రోకర్ లాగా మనం వ్యవహరించాలి. కేవలం ఒక పక్షానికి అనుకూలంగా మనం వ్యవహరించినా, వైరి పక్షాలు మనల్ని నమ్మాలి. రెండు పక్షాలు మనలను నమ్మడం ప్రారంభిస్తే మనం ముందుకు వెళ్లవచ్చు.  

నిజమైన సమస్యలెంటి, మనం ఏమి చేయవచ్చు అనేవి మనం గుర్తించాలి. “వాళ్ళు టెర్రరిస్టులు, వారితో నేను మాట్లాడను” అని బిగపెట్టి కూచుంటే మనం ఏమీ చేయలేము. అయితే ప్రస్తుత ప్రపంచంలో అది ఎక్కువ కనిపిస్తోంది.   

 

ఇంకా ఉంది

 

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7