Thought Economics- War and Peace- PArt 4

శాంతి- హార్థిక ఆలోచనలు

భాగం-4

ఈ వ్యాసములో సంఘర్షణ, శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు:

1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్, అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్

2. డాక్టర్ శిరీన్ యెబడి, మానవహక్కుల న్యాయవాది, విద్యావేత్త

3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు, క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు)

4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు)

5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు, ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు)

6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్, న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం )

7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి)

వీరితో మనం యుద్ధ కారణాలు, సమాజంపై వీరి ప్రభావం, శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.

 

ప్రశ్న 6: అధికారమే పరమావధిగా ఉన్న ప్రభుత్వాలపై అహింసావాదం పని చేస్తుందా?

లేక్ వాలేశా: దీనికి సులభమైన సమాధానం దొరకదు. 1989లో పోలాండులో 2 లక్షల మంది  రష్యన్ సైనికులు, టాంకులు, రాకెట్సు ఉండేవి. తిరుగుబాటుదారులుగా మేము కేవలం రాజకీయ వ్యవస్థను మార్చగలమని నమ్మకంతో ఉన్నాము. ప్రత్యక్ష పోరాటం చేసే అవకాశం లేదు. మా అహింసా వాదం, పోలిష్ పోపు, ఇతర దేశాల నుండి సహాయం మమ్మల్ని గెలిపించాయి. శాంతి ఉద్యమాలకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి, ఎదుటివారిని చంపకుండా గెలిచే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. యుద్ధం కంటే మానవులు శాంతినే ఎక్కువ కోరుకుంటారు.  

ప్రశ్న 7: ఘర్షణలకు, యుద్ధాలకు ముఖ్య కారణాలు ఏవి?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: వివిధ ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలు వాటి మిశ్రమాలు ఆధారంగా వివిధ ఘర్షణలు చోటుచేసుకుంటాయి. జాతి, మతముల  ఆధారంగా  ప్రజలను యుద్ధాలకు ప్రేరేపిస్తారు. కేవలం మతమే యుద్ధానికి దారి తీయదు. ఎప్పటికైనా డబ్బు, అధికారమే పరమావధిగా యుద్ధం ఉంటుంది. అనేకమందిని యుద్ధానికి ప్రేరేపించేవి జాతి, మతము: ఏదైతే ఎదుటివారిని తక్కువగా చూపించి, వారిని చంపటము సరైనదే  అని నిర్థారించే కారణం అయి ఉంటుంది.  మరోవైపు వాతావరణ మార్పు జనాభా ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది, అది ఘర్షణలకు దారి తీస్తుంది.  సూడాన్, డర్ఫర్ లను మనం గమనిస్తే ఎడారీకరణ ముఖ్య అంశాలలో ఒకటి. ఎందుకంటే సంచార జాతులు, బృందాలను వారు పశువులను మేపుకొనే స్థానాల నుండి దూరంగా తరిమివేయబడ్డారు.  

ఆర్థిక కారణాలు కూడా ముఖ్యమైనవే. యూరోప్ అంతటా జరిగిన విస్తృత ప్రదర్శనలకు కారణాలు ఆర్థిక వ్యవస్థల నిశ్చలత్వం, కూలిపోవటమే.  హింసాత్మక సంఘర్షణలకు బీజాలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. గమనిస్తే ఇక్కడ అమెరికాలో కూడా ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు వారు కూడా అసహనానికి గురవుతారు. ప్రజల, వారి కుటుంబాల  మౌలిక అవసరాలు  తీరనప్పుడు,   భవిష్యత్తు అంధకారమైనప్పుడు, మార్పు కోసం  వారు హింసకు పాల్పడతారు.

హింసకు ప్రజలను ప్రేరేపించడం సులభమే. ఒకసారి దేశాన్ని, ప్రజలను విడగొట్టిన తర్వాత వారిని తిరిగి కలపడం చాలా కష్టం. ఇప్పటికీ అమెరికాలో ఆదాయ అసమానతలు, జాతి వివక్షతలు ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ చేపట్టిన పని ఇంకా పూర్తి కావలసినది ఉంది.  

ప్రశ్న 8: లాండ్ మైన్స్ గురించి మీ ప్రధాన ఆందోళనలు ఏమిటి?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: నేను ప్రచారానికి పని ప్రారంభించినప్పుడు మొదట ఎదుర్కున్న సమస్య లాండ్ మైన్లే. సిద్ధాంతపరంగా సైన్యాలు తమకు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇచ్చే పద్ధతులనే వాడతారు. లాండ్ మైన్ల విషయానికి వస్తే దీర్ఘ కాలంలో పౌరుల మీద జరిగే ప్రభావం మీద అంతగా ఎవరూ ఆలోచించినట్టు లేదు. యుద్ధం ముగిసిన తర్వాత , లాండ్ మైన్ల వలన చనిపోయేది సాధారణ పౌరులే. యుద్ధ న్యాయం వికటించేది ఇక్కడే. కనుక వీటిని నిషేధించే సమయం దగ్గరకు వచ్చింది.  

ప్రశ్న 9: రోబోలతో యుద్ధాల నుండి మానవులకు, జాతీయ భద్రతకు వచ్చే ముప్పు ఏమి?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: మనుషులను చంపేందుకు సంపూర్ణ అధికారం రోబోలకు ఇచ్చి యుద్ధాలలో వినియోగించటం అనేది విచారించవలసిన విషయం. ఇది అణ్వాయుధాల కంటే భయంకరమైనది.

 

 

ప్రశ్న 10: ద్రోన్ల ద్వారా మానవ భద్రతకు వచ్చే ముప్పు ఏది?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: ద్రోన్లను ఆపటానికి కావలసిన నైతిక కారణాలు కొన్ని సందర్భాలలో అవసరమవుతుంది. ప్రపంచమంతటా జరుగుతున్న  కొన్ని హత్యలకు డ్రోన్ లను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ నైతికపరమైన అంశాలే. న్యాయశాస్త్రానికి బయట ఉన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. డ్రోన్ లను వినియోగించకుండా యెమెన్, సోమాలియా లలో అమెరికా ఏమి చేసేది? దాడికి దిగేవారా? డ్రోన్ వలన దాడికి దిగకుండా హత్యలకు అమెరికా పాల్పడుతోంది. దీని ద్వారా దాడి అపవాదు నుండి తప్పించుకుంటున్నారు.  మరి కొంత ముందు కాలానికి వెళితే గాలిలో, భూమి మీద, నీటిలో/పైన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఆయుధ వ్యవస్థ వస్తున్నదాని ఊహించుకుంటేనే భయమేస్తోంది.

ప్రశ్న 11: మానవాళిని పెద్ద ఎత్తున నాశనం చేసే ఆయుధాలనుండి మానవ భద్రతకు ఎటువంటి ముప్పు ఉంది?

ప్రొఫెసర్ జోడీ విలియమ్స్: అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం మరలా ప్రారంభమయ్యింది. నార్వే ఇందులో ముందు స్థానం లో ఉంది. మానవాళి నిరాయుధీకరణ ఉద్యమంగా  దీనిని మార్చింది. అయితే అమెరికా ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేదు.  అమెరికా జపాను మీద అణ్వాయుధం ప్రయోగించటము వలన రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోలేదు. జర్మనీ నుండి జపాను వైపుకు రష్యా అందరి దృష్టి మరల్చటం, దానికి జపాను భయపడటం జరిగింది. అప్పటికే జపాను లొంగిపోయే చర్చలలో ఉంది. అమెరికా తన అణ్వాయుధాలను పరీక్షించేందుకే వాడింది. ఎందుకంటే హీరోషిమాలో వాడిన బాంబు వేరు, నాగసాకిలో వాడిన బాంబు వేరు. వారు రెండు రకాల ఆయుధాలను పరీక్షిస్తున్నారు.

ఆయుధాల గురించిన మన చర్చలలో మానవత్వాన్ని మళ్ళీ ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయుధాలు ఎంత శక్తివంతమైనది అన్నది కాదు, మానవాళికి ఎంత చేటు తెస్తున్నది అన్నది ముఖ్యం. కేవలం వాగ్వివాదాలలో మునిగే మేధావులకంటే మనకు “ఇప్పటివరకు జరిగింది చాలు, ఈ ఆయుధాలు మానవాళిని నాశనం చేస్తాయి, ఇవి అన్యాయం, అనైతికం, వాటిని వదిలించుకోవాలి” అనే కొత్తతరం ప్రచారకర్తలు కావాలి. సంభాషణలను మన గుప్పిట్లోకి తీసుకోవాలి. పాతతరం ఇగోలతో మునిగి ఏది తప్పు ఏది ఒప్పు అని వాదించే వాళ్లనుండి ఈ ఉద్యమం కొత్తతరం యువకుల చేతుల లోకి రావాలి.    

 

ఇంకా ఉంది

 

మూలం:

https://thoughteconomics.com/war-and-peace/

రచయిత: వికాస్ షా


Comments

Popular posts from this blog

Thought Economics- War & Peace- Part 10

Thought Economics- War & Peace- Part 9

Thought Economics- War and Peace- Part 7